ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కు అరుదైన గౌరవం... అభినందించిన ప్రధాని మోదీ

  • ప్రపంచ స్థాయిలో సెంట్రల్ బ్యాంకు గవర్నర్లకు ర్యాంకులు
  • ఏ ప్లస్ కేటగిరీతో మొదటి ర్యాంకు సాధించిన శక్తికాంత దాస
  • భారత ఆర్థిక ఆధిపత్యానికి నిదర్శనమన్న ప్రధాని మోదీ
ఈ ఏడాది గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్ లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ కు ఏ ప్లస్ ర్యాంకు లభించింది. ఏ ప్లస్ ర్యాంకు ముగ్గురికి లభించగా, ఆ ముగ్గురిలో శక్తికాంత దాస్ అగ్రస్థానంలో నిలిచారు. 

రెండో స్థానంలో స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ థామస్ జె జోర్డాన్, మూడో స్థానంలో వియత్నాం సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఎన్గుయెన్ థి హాంగ్ నిలిచారు. ఈ విషయాన్ని ఆర్బీఐ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. శక్తికాంత దాస్ కు అరుదైన ఘనత దక్కడం పట్ల ఎంతో సంతోషిస్తున్నామని పేర్కొంది. 

దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. "ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కు శుభాభినందనలు. భారతదేశానికి ఇవి గర్వించదగిన క్షణాలు. శక్తికాంత దాస్ కు లభించిన ఘనత ప్రపంచ వేదికపై మన ఆర్థిక ఆధిపత్యాన్ని ప్రతిబింబిస్తోంది. శక్తికాంత దాస్ అంకితభావం, దార్శనికత దేశ పురోగతి తీరును మరింత బలోపేతం చేస్తాయని ఆశిస్తున్నాను" అంటూ వివరించారు.

Shaktikanta Das
RBI Governor
Global Report Card
Narendra Modi
India

More Telugu News